Monday, January 24, 2011

నవీనాంధ్రప్రదేశ్ లో తెలుగు-పిల్లలు-తల్లిదండ్రులు


పిల్లలూ!! వారి తల్లిదండ్రులూ!! మన మందరం ఒక విషయం గమనించాలి!!
మనిషి పుట్టి మనుగడ మొదలయ్యాక బట్టకట్టాలని తలపుకివచ్చి ఆకులు కట్టుకునేవాడని అందరూ వినే ఉంటారు.
మరి భాష కూడ అలాగే అతనిలోని ఆలోచనలను చెప్పటానికి తయారు చేసుకున్నాడు. ప్రాంతా  లవారీగా దానికి ఒక రూపం ఇచ్చాడు.  రకరకాల ధ్వనులతో కాలక్రమేణా దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పడింది.  
తెలుగు భాష మాతృభాషగా కల వారు ఎంతో అదృష్టవంతులని తెలుసుకోవాలి.  ఎందుకంటే భారత దేశంలోని దక్షిణాది భాషలన్నింటి లోనూ తెలుగుభాష అతి మృదుమధురంగా ఉంటుందని ఈ భాషను "ఇటాలియన్ ఆఫ్ ద ఈష్ట్" గా గుర్తించారు. 
మిగిలిన అన్ని భాషలలాగా తెలుగు భాష ప్రచారంలోకి ఎక్కువగా రాలేదు.  కారణం తెలుగు వాళ్ళు చాలా సిగ్గుపడతారు.  త్వరగా ముందుకు దూసుకుపోరు, భాషవాడకంలో మిగిలినవారిలాగా!! ఇది, ముఖ్యంగా "మొహమాటం" ముందు పుట్టి తరవాత "వాళ్ళు పుడతారు" కాబట్టి.  అందరూ కూడా ఎక్కువగా ఎదుటివారి భాష నేర్చుకుని, వారిలాగా, వారిలో ఒకరుగా కలిసిపోతారు కాబట్టి.  దాంతో, తెలుగు భాష వారితోనే ఉండిపోతుంది.  ఇది ఒక రకంగా వారి యొక్క పరభాషా సహనానికి, అభిమానానికి, దానిని భరించ గలిగే ఓపికకీ మంచి నిదర్శనం. 
మాతృ భాష అన్నది ఎంతో తీయనయినది, తీయదనం నింపేది.  సుఖంలోనూ, దుఖంలోనూ గుర్తువచ్చేది, మనిషి పలికేది మాతృభాషే....... కాబట్టి, ప్రతీ తెలుగు ప్రజా, ఈ గడ్దమీద పుట్టి నందుకు తెలుగు భాషను నేర్చుకుని తీరాల్సిందే.......... దీనికి ఒక ఉదాహరణ చెబుతాను......
జపాన్ దేశంలోని వారు పది సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ కూడ మాతృభాష మాత్రమే నేర్పుతారు.  ఆ తరవాతే వేరే సబ్ జెక్ట్స్ మొదలు పెడతారు.  అధునాతన శాస్త్రీయ విజ్ఞానం కూడ వారి భాషలోనికి అనువదించబడుతోంది.  అదీ విడుదల అయిన కొన్ని గంటల లోపునే.  పి హెచ్ డీ, రిసర్చ్ లెవల్ లో కూడ వాళ్ళ భాషలోనే పని జరుగుతుంది.  వాళ్ళ కంప్యూటర్ లు సయితం జపనీస్ లోనే మాట్లాడతాయి.
ఏ మాతృభాష అయినా సరే ఒక్క ఇంగ్లీష్ (కొంత ఫ్రెంచ్) తప్ప అచ్చులు-హల్లులు చాలా ఎక్కువ. అందుకే  అవి క్లిష్టతరం నేర్చుకోవటానికి.  వాక్యాలు పూర్తి చేయటానికి ఎక్కువ పదాలు వాడవలసి వస్తుంది.    అదే ఇంగ్లీషు అయితే "చెప్పదలుచు కున్నదాన్ని చాలా తక్కువ అక్షరాల్లో పూర్తి చేయవచ్చును" అనే ఒక అభిప్రాయం అందరిలో ధృవపడి పోయింది.  అధునాతన విద్యావిధానంలో "అన్నింటినీ అనువదించటం కన్నా ఇంగ్లీషు నేర్చేసుకుంటే పోలే"  అన్న భావం ఒకటి నాటుకు పోయింది.
ఈ ౨౧ వ శతాబ్దంలో కృత్రిమత ఎక్కువై పోయి, "యంయన్ సీ" ల పోకడలు, వాటి ప్రభావం అంతా ఇంతా కాదు, హిమవత్పర్వత శ్రేణంతగా పెరిగిపోయి అంతా అమెరికా ప్రభావమే అయిపోయి పుట్టిన పాపాయితో సహా "అమ్మా-నాన్న" అంటే నామొషీ గా అనిపించే తల్లి-దండ్రులతో నిండిపోయింది.  
అసలు నిజం చూస్తే ఈనాటి తల్లి-దండ్రులకు పిల్లల్ని సాకేంత టైమ్ దొరకటం లేదు.  భాషా-ధ్యాసా లేని ఆయమ్మల ఒడిలో పెరిగే చంటి పాపలు "మమ్మీ-డాడీ" లని డబ్బు సంపాదించే యంత్రాలుగా, తమకు కావలసినది అందించే "రోబోట్ లలా" చూస్తున్నారు తప్ప................... 
జీవితాలకి కావలసిన విలువలను, మన సంస్కృతి, సాంప్రదాయాలను వంట పట్టించే ప్రేమ మూర్తులుగా చూసేదెప్పుడో!!!
ఈ మద్య కాలంలో పిల్లలు "మా అమ్మ కీ, నాన్నకీ పట్టిన పిచ్చి కానీ, నాకు చదువు వస్తుందా" అనుకుంటున్నారు.  ముఖ్యంగా ౮వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు.  గోడలు దూకేస్తున్నారు కొందరు.  మరి కొందరు ఎక్స్టా క్లాసెసె అనీ, ట్యూషన్ అనీ, ఆబాకస్ క్లాస్ అనీ, ఫాషన్ డిసైనింగ్, డ్రాయింగ్ అంటూ రకరకాల క్లాసులకి పంపేస్తూంటే విసుగెత్తిపోతున్నారు.  తల్లిదండ్రులు డబ్బు ఖర్చు చేసేస్తే పిల్లలు బాగా అయిపోతారని అనేసుకుంటున్నారు.  మన సంసృతి, సాంప్రదాయాలు తెలియచేసే శాస్తీయ కళలు నేర్చుకుంటే సుఖం, శాంతి నిచ్చి హాయిని కలుగ చేస్తాయని తెలుసుకునేదెప్పుడో!!!
"ఇంగ్లీషు" చదువులతో రాజ్యాలేలేయవచ్చనే భావన ముందు............తెలుగులో చదువుకుంటే కనీసం మన ప్రక్క ప్రాంతంలో కూడా ఉద్యోగవకాశం లేదాయె!!! అన్ని రాష్టాల్లోనూ వాళ్ళ మాతృభాష వారికి ఉద్యోగాలు కేటాయించబడ్డాయి.  కానీ మన రాష్టంలో మాత్రం ఎంతో ఉదాత్తమైన రీతిలో అందరికీ ఉద్యోగాలు ఇస్తుంది, కానీ తెలుగు వారికి మాత్రం ఈయదు.  మన రాష్త్ర ప్రభుత్వం యొక్క కార్యాలయాల్లో తెలుగువారి సంఖ్య కొంత మెరుగ్గా ఉన్నా కేంద్రీయ కార్యాలయాలు మన రాష్ట్రంలోనే ఉన్నా అందులో రాష్ట్రేతరులే ఎక్కువ.
ఇకపోతే "తెలుగు" భాష తీసుకున్న స్కూలు పిల్లలకి తక్కువ మార్కులు రావటం మరో విశేషం.  ఇది కాదని "సంస్కృతము", "హిందీ" ఎక్కువ మార్కుల కోసం తీసుకోవటం జరుగుతోంది.  పోనీ అదేనా నేర్చుకుంటారా అంటే అదీ లేదు.  పరీక్ష కోసం ముక్కున పెట్టుకుని, ఆ తరవాత మర్చిపోతున్నారు.  దానితో ఏ భాషా సరిగ్గా రాకుండా అయిపోతున్నారు.
తెలుగులో ఎంతో సాహిత్యం-పద్యాలు, కథలు, కవిత్వం, వ్యాసాలు, వచనాలూ, కావ్యాలూ, గ్రంథాలూ, హాస్యం ఉన్నాయి.  ఓ పాతికేళ్ళ క్రితం వరకూ కూడ "తెలుగు" కనీసం పదో క్లాసు వరకూ చదువు కోవటం, జరిగింది.  వ్యాకరణంలో "సంధులు", "సమాసాలు", ఉత్పలమాల-చంపకమాల లాటి "ఛందస్సు", ఉన్నాయి, నేర్చుకుంటే ఎంతో బాగుంటాయి.  ఓ పజిల్ చేసినట్లు, ఓ ఛాల్ంజ్ లా ఉండే లెఖ్ఖ చేసినట్లుగా!!! అంతెందుకు, ప్రఖ్యాత రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మగారు వాళ్ళాయన మీద కోపం వచ్చినప్పుడల్లా "మీ మీద ఓ కథ రాసేస్తాను" అనేవారుట.
భాష అన్నది అభివృద్ధికోసం, మన మనస్సులోని అనేకానేక ఆలోచనలకు రూపం దిద్దటం కోసం, ఉచితానుచితాలు తెలుసుకుని, జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించటం కోసం, మనలో ఎటువంటి మహానుభావులు ఉన్నారో, ఏమేమి చేసారో, ఎలా చేసారో తెలుసుకోవటం కోసం. మన ఆలోచనలను ప్రభావితం చేసి మనని ఎంతో ఎత్తుకి ఎదిగేలా చేసేదే మన మాతృభాష.  అందుకే అందరూ "చిన్నతనం" అనుకోకుండా ఎంతో "గర్వంగా" మన భాష నేర్చుకోవాలి, అందులోనే వ్యవహరించాలి.










2 comments:

  1. తెలుగు భాష గురించి చాలా బాగా రాసారు. అందరు ఇది అర్ధం చేసుకుంటే మన తెలుగు భాష గురించి ప్రపంచమంతా తెలుస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు కదా. నేను తెలుగు అమ్మాయి అయినందుకు గర్వపడుతున్నాను.

    ReplyDelete
  2. చాలా సంతోషం 

    ReplyDelete